by సూర్య | Sun, Mar 29, 2020, 01:34 PM
పేద, ధనిక అనే తేడా లేకుండా కరోనా వైరస్ అందరినీ టెన్షన్ పెడుతోంది. తాజాగా జైళ్లల్లో వివిధ నేరాల కారణంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను సైతం కరోనా వైరస్ మరింతగా భయపెడుతోంది.
ఈ మేరకు కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జమ్ము ప్రాంతంలొని వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలు తమను తాత్కాలికంగా విడుదల చేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాల్సిందిగా జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు.
ప్రాణాంతక కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా షరతులతో కూడిన కారణాలతో విడుదల చేయాల్సిందిగా ఖైదీలు జైలు సూపరిండెంట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
జైలులో ఉన్న ఖైదీలతో కనీసం ఒక్కరికి ఈ వైరస్ సోకినా... చాలా తొందరగా మిగతా ఖైదీలకు కూడా సోకే ప్రమాదం ఉందని ఖైదీలు ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం తమకు బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ఖైదీలను పెరోల్ లేదా షరతులతో కూడిన బెయిల్తో విడుదల చేశాయి.
ఈ నేపథ్యంలో పంజాబ్లో సుమారు 6వేల మంది ఖైదీలను విడుదల చేయబోతుండగా, దాదాపు పదకొండు వేలమంది దోషులు, అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేయాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్లో 20 కరోనా కేసులు నమోదయ్యాయి.
Latest News