by సూర్య | Mon, Mar 23, 2020, 02:26 PM
టీమిండియా సీనియర్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా, అతని భార్య ప్రియాంక రైనా రెండోసారి తల్లిదండ్రులు అయ్యారు. సోమవారం తెల్లవారుజామున ప్రియాంక రైనా పండంటి మగ బిడ్డకు జన్మిచ్చారు. రైనా దంపతులకు ఇప్పటికే 4 ఏళ్ల పాప (గ్రేసియా రైనా) ఉంది. ఇప్పుడు అబ్బాయి పుట్టడంతో ప్రస్తుతం రైనా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని 'ఎంఎస్ ధోనీ ఫాన్స్ అఫీషియల్' తెలిపింది. అభిమానులు అందరూ రైనాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కొరోనా మహమ్మారి కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్-13 ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. దీంతో అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ను పక్కనపెట్టి ఇంటికి పయమయ్యారు. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా చెన్నైను వీడి తన ఇంటికి చేరుకున్నారు. ప్రియాంకకు డెలివరీ సమయం దగ్గర పడడంతో ఆమెనే చూసుకుంటూ ఇంటి వద్ద సరదా సమయం గడిపాడు.
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.రైనా తన 4 సంవత్సరాల కుమార్తె గురించి ఇటీవల బాగా మాట్లాడాడు. 'నా కుమార్తె నాకు పెద్ద మద్దతుదారు. ఆమె రాకతో నా జీవితమంతా మారిపోయింది. నేను ఆమెతో పంచుకునే చిన్న చిన్న క్షణాలు చాలా విలువైనవి. తొలి రోజు నుండి నా కూతురు నా పక్షాన ఉంది. ఆమె నా ట్రావెల్, జిమ్ బడ్డీ. నా భార్య, నేను ఎక్కడికివెళ్ళినా మాతో పాటే వస్తుంటుంది' అని రైనా కుమార్తె గురించి చెపుతూ సంబరపడిపోయాడు.
Latest News