by సూర్య | Sat, Mar 21, 2020, 12:42 PM
ఏపీ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి కొత్తగా 3 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసింది. ఏపీలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో 3 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖ జిల్లాలోని పాడేరు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అమిత్ బిశ్వాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు కొత్త మెడికల్ కాలేజీలకు మొత్తం రూ.975 కోట్లు ఖర్చు కానుంది.
ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.325 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో కేంద్రం వాటా 60 శాతం (రూ.195 కోట్లు), రాష్ట్ర వాటా 40 శాతం (130 కోట్లు)గా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి పత్రాలను కేంద్రం పంపింది. ఈ పత్రాల పై వీలైనంత త్వరగా సంతకం చేసి స్టాంపులు వేసి మళ్లీ కేంద్రానికి పంపాలని కేంద్ర కార్యదర్శి అమిత్ బిశ్వాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.