చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం

by సూర్య | Sat, Mar 21, 2020, 08:40 AM

కరోనా విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఇటీవలే కోవిడ్- 19ను చైనా వైరస్‌గా అభివర్ణించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని ఆయన దుయ్యబట్టారు. వైరస్‌ గురించి సమాచారాన్ని చైనా దాచిపెట్టడంవల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ మండిపడ్డారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ.. కరోనా వైరస్ విషయంలో మరోసారి చైనా తీరును తప్పుబట్టారు. చైనాలోని వుహాన్‌లో వెలుగుచూసినట్టు భావిస్తున్న కరోనా వైరస్‌ను ప్రారంభంలోనే కట్టడిచేస్తే అది ఆ ప్రాంతానికే పరిమితమయ్యేదనే ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయం ప్రపంచం మొత్తానికీ తెలుసునని, ఇదే నిజమని తానుకూడా బలంగా నమ్ముతున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు.


 


ఈ వైరస్‌ గురించి కొన్ని నెలల ముందే సమాచారం తెలిసి ఉంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్‌ గురించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రపంచదేశాలకు తెలపడంలో చైనా విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు, కరోనా తీవ్రతను ప్రపంచానికి తెలియనీయకుండా అడ్డుకున్న చైనా.. అక్కడి వైద్యులు, జర్నలిస్టులపై చర్యలు తీసుకుందని అన్నారు. ఇలా ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణమైన చైనా దీనికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, దీనికి కారణమైన చైనాపై ప్రతిచర్యలు ఉంటాయా అన్న ప్రశ్నకు మాత్రం ట్రంప్ సమాధానం దాటవేశారు.


 


మరోవైపు, ‘కరోనా వైరస్‌ ప్రాథమిక నివేదికలను బహిర్గతం కాకుండా చైనా తొక్కిపెట్టింది.. దీంతో ఈ మహమ్మారి తీవ్రతను అరికట్టగలిగే అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కోల్పోయారని’ అమెరికా జాతీయ భద్రతా మండలి ట్వీటర్‌లో పేర్కొంది. వైరస్ విషయంలో చైనాపై జాతీయ భద్రత మండలి ఆరోపణల నేపథ్యంలో ట్రంప్‌ పైవిధంగా స్పందించారు. అయితే, రెండు నెలల కిందట మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించడానికి చైనా చేపట్టిన చర్యలను ట్రంప్ ప్రశంసించిన విషయం తెలిసిందే.


 


కరోనా వైరస్‌ను అమెరికా సైన్యమే తీసుకొచ్చిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గతవారం ఆరోపణలు గుప్పించగా.. వైరస్ విజృంభణకు సంబంధించిన నిందను తమ మీదకు మళ్లించడానికి చైనా ప్రయత్నిస్తోందని అమెరికా తిప్పికొట్టింది. చైనాలో కంటే ప్రపంచంలోని మిగతా దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ప్రకటించిన రోజే అమెరికా-చైనాలు పరస్పరం విమర్శలకు దిగాయి.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM