by సూర్య | Sun, Feb 16, 2020, 06:59 PM
మూడు వన్డేల్లో వికెట్లు తీయనంత మాత్రాన జస్ప్రీత్ బుమ్రా అందించిన విజయాలను ఎలా మర్చిపోతారని విమర్శకులపై భారత పేసర్ మహ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా గాయపడి తిరిగొచ్చిన వెంటనే రాణించడం అంత సులువు కాదన్నాడు. న్యూజిలాండ్తో ప్రాక్టీస్ మ్యాచ్ ముగిసిన అనంతరం షమీ మాట్లాడుతూ విమర్శకులకు చురకలంటించాడు. బయట కూర్చొని ఇతరులను విమర్శించడం సులువని కానీ, ఆడేవారికి తెలుస్తుందని ఆ బాధేంటోనని షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మధ్య చాలా మంది ఆటగాళ్లను విమర్శిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని మండిపడ్డాడు. ‘3-4 మ్యాచుల్లో బాగా ఆడకపోతే అతన్ని విమర్శిస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలను. కానీ ఓ మూడు మ్యాచుల్లో వికెట్లు తీయనంత మాత్రాన మ్యాచులను గెలిపించే బుమ్రా సత్తాను, అందించిన విజయాలను ఎలా మర్చిపోతారు. ఒక్క సిరీస్ వైఫల్యంతో అతడు సాధించింది అంతా పక్కన పెట్టేస్తారా? మీరు సానుకూలంగా ఆలోచిస్తే ఆ ఆటగాడికి మంచిది. అది అతడిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. గాయం నుంచి కోలుకొని వెంటనే రాణించడం కష్టమని ఒక క్రీడాకారుడిగా నాకు తెలుసు. వ్యాఖ్యానాలు చేస్తూ డబ్బులు సంపాదించేవారికి విమర్శించడం సులభం. ఆటగాళ్లకు గాయాలు సహజం. 2015లో నేనూ గాయపడ్డాను. ఆ తర్వాత పుంజుకున్నాను' అని షమీ ఫైర్ అయ్యాడు.
Latest News