by సూర్య | Sun, Feb 16, 2020, 07:02 PM
ప్రేమించిన యువతి పెళ్లి మాటెత్తగానే యువకుడు పరారైన ఘటన తిరుపతిలోని కొర్లగుంటలోని నవోదయ నగర్లో చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ అవిలాలకు చెందిన ఓ అమ్మాయికి కాలేజీలో కొర్లగుంటకు చెందిన చంద్రమౌళి అనే యువకుడు పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. చివరకు వారిద్దరు అమ్మాయి కుటుంబ సభ్యుల కంట పడడంతో ఇరువురికి పెళ్లి చేయాలని భావించి, చంద్రమౌళి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అడిగారు. అయితే, వారు ఒప్పుకోకపోవడంతో బాధిత యువతి తిరుచానూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో భయపడిపోయిన యువకుడు, అతడి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి సముఖత వ్యక్తం చేశారు. అయితే, ఈ సమయంలో చంద్రమౌళిని గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరుకు పంపారు. దీంతో మహిళా సంఘాలతో కలసి బాధిత అమ్మాయి ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.