by సూర్య | Sat, Feb 15, 2020, 02:28 PM
ప్రస్తుతం ఏ వస్తువు కావాలన్నా ఆన్ లైన్ లో బుక్ చేస్తే క్షణాల్లో ఇంటికి వచ్చేస్తుంది. వేసుకునే బట్టల నుంచి తినే తిండి వరకు అంతా ఆన్ లైన్ మహిమ అయిపోయింది. ఇంట్లోనే కూర్చొని క్షణాల్లో కావాల్సింది తెప్పించుకోవచ్చు. ఈ కామర్స్ బిజినెస్ వేగంగా వృద్ది చెందడంతో ఈ సేవలన్ని అందుబాటులోకి వచ్చాయి. అయితే త్వరలోనే మద్యం వ్యాపారాన్ని కూడా ఆన్ లైన్ చేసేందుకు లిక్కర్ ఇండస్ట్రీ కసరత్తు చేస్తోంది. త్వరలోనే మద్యం వ్యాపారాన్ని ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ తెలిపారు. కర్ణాటకలో ఇప్పటికే ఈ వ్యాపారం ఉందన్నారు.
మద్యం ఆన్ లైన్ అయితే ప్రమాదం తప్పదని మరికొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం ఆన్ లైన్ విధానానికి అంగీకరించపోవచ్చని అమ్రిత్ అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవానికి అన్ని ప్రభుత్వాలకు కూడా మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు చేస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని లిక్కర్ ఇండస్ట్రీ నిపుణులు తెలిపారు. లిక్కర్ ఇండస్ట్రీ చేసే ఈ ప్రయత్నాలు సఫలమవుతాయో లేక విఫలమవుతాయో చూడాలి. మద్యం ఆన్ లైన్ విధానంతో చెడు జరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వాలు ఒప్పుకోవన్న చర్చ జరుగుతోంది.