by సూర్య | Wed, Feb 12, 2020, 02:43 PM
దాయాదులు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగాలని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కోరుకుంటున్నాడు. ఒకవేళ దాయాదుల మధ్య మ్యాచ్ జరిగితే ఆటకి ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. మరోవైపు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా ఇదరూ దేశాల మధ్య మ్యాచ్లు జరిగితే యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుందని పేర్కొన్నాడు. అఫ్రిది కూడా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగాలన్నాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యువరాజ్ మాట్లాడుతూ... '2004, 2006, 2008 పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు కూడా క్రికెట్ ఆడే పరిస్థితులు ఉన్నాయి. కానీ.. అది మన చేతిలో లేదు. మనందరం క్రికెట్ని ప్రేమిస్తాం. కానీ.. మన ప్రత్యర్థులు ఎవరు అనేది మనం నిర్ణయించలేం. అయితే దాయాదుల మధ్య మ్యాచ్ జరిగితే అది ఆటకి ఎంతో ఉపయోగపడుతుంది' అని చెప్పుకొచ్చాడు. 'భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సిరీస్ ఉంటుందని అనుకుంటున్నా. సిరీస్ ఉంటే కనుక యాషెస్ కంటే పెద్ద సిరీస్ అవుతుంది. క్రీడా అభిమానులకు రాజకీయాలు అడ్డురాకూడదు. ఇరు దేశాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కూర్చుని మాట్లాడుకోవాలి' అని షాహిద్ అఫ్రిది అన్నాడు. భారత్-పాకిస్థాన్ 2013 నుండి ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. ఇక చివరిసారిగా 2008లో టెస్ట్ సిరీస్ ఆడారు.
Latest News