by సూర్య | Wed, Feb 12, 2020, 02:33 PM
తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్ ముందు సన్నాహకంగా జరిగిన ముక్కోణపు టీ20 టోర్నమెంట్ ఫైనల్లో భారత్ మహిళలు ఓటమి చవిచూశారు. బుధవారం జరిగిన ఈ ఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ బెత్ మూనీ (71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగింది. భారత బౌలర్లలో దీపిక శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ రెండేసి వికెట్లు తీయగా.. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఆసీస్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ నిర్ణీత ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఓపెనర్ స్మృతి మంధాన 66 పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక పెవిలియన్ క్యూ కట్టారు. షెఫాలి వర్మ(10), జెమీమా(2), హర్మన్ ప్రీత్(14), దీప్తీ శర్మ(10) తీవ్రంగా నిరాశపరిచారు. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత మహిళలు కేవలం మూడు పరుగులే చేసి రెండు వికెట్లు సమర్పించుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జెస్ జొనాస్సెన్ 5 వికెట్లు తీసి సత్తా చాటింది. వ్లేమింక్ 2 వికెట్లు, పెర్రీ, స్కట్, సూథర్లాండ్కు తలో వికెట్ దక్కింది.
Latest News