by సూర్య | Fri, Jan 17, 2020, 01:54 PM
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే రాజ్కోట్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరో 46 పరుగులు చేస్తే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 9000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఫలితంగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంటాడు. అదే క్రమంలో మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, బ్రియన్ లారాల రికార్డుని కూడా బద్దలు కొట్టనున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేల్లో 215 ఇన్నింగ్స్ల్లో 8,954 పరుగులు చేశాడు. అయితే, వన్డేల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకునేందుకు సౌరవ్ గంగూలీ 228 ఇన్నింగ్స్లు అవసరం కాగా... సచిన్ టెండూల్కర్ 235, లారా 239 ఇన్నింగ్స్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియాతో రాజ్కోట్ వేదికగా జరిగే మూడో వన్డేలో రోహిత్ శర్మ మరో 46 పరుగులు చేస్తే వీరికంటే అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధిస్తాడు. అంతేకాదు వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్ (205) తర్వాతి స్థానంలో నిలుస్తాడు. దీంతో పాటు రాజ్కోట్లో రోహిత్ సెంచరీ సాధిస్తే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు.
Latest News