by సూర్య | Thu, Jan 16, 2020, 01:07 PM
ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఒడిశాలోని నిర్గుండి వద్ద 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయాలు అయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను కటక్ లోని ఆస్పత్రులకు తరలించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రయాణికులను భువనేశ్వర్ చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
ఈ రైలు ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ సీజన్ కావడం.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైల్వే అధికారులతో పాటుగా స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సైతం సహాయం చర్చల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.
Latest News