by సూర్య | Tue, Jan 14, 2020, 05:01 PM
ఏపీకి మూడు రాజధానులు దాదాపు ఖాయమైంది. జనవరి 20న ఏపీ కేబినేట్ ఉదయం 9.30 నిమిషాలకు భేటి కానుంది. అదే రోజు ఉదయం 11.30 నిమిషాలకు అసెంబ్లీ సమావేశం కానుంది. మంత్రి మండలి భేటిలో హైపవర్ కమిటి నివేదికకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపనున్నారని సమాచారం.
ఈ నెల 20,21,22 తేదిలలో శాసనసభ, మండలి సమావేశాలు ఉంటాయని అసెంబ్లీ కార్యదర్శి తెలిపారు. కానీ అసెంబ్లీ సమావేశం జనవరి 20వ తేది ఒక్కరోజే జరగనుందని తెలుస్తోంది. అదే రోజు హైపవర్ కమిటి నివేదికను అసెంబ్లీ ఆమోదించే అవకాశం ఉంది.
వాస్తవానికి ఈ మూడు రోజుల సమావేశాల్లో సీఆర్డీయే చట్ట సవరణ బిల్లు, ఇంగ్లీషు మీడియం, ఎస్సీ వర్గీకరణ బిల్లుల పై చర్చించి ఆమోదిస్తారని భావించారు. కానీ అన్నింటిని ఒకే రోజు ఆమోదిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సర్కార్ విశాఖ ఆర్కే బీచ్ లో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్,కర్నూలులో జ్యూడిషియరీ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటి, బీసీజీ గ్రూపు నివేదికలను ఇచ్చాయి. ఈ నివేదికలను పరిశీలించి ఫైనల్ నివేదికను ఇచ్చేందుకు ఏపీ సర్కార్ హైపవర్ కమిటిని ఏర్పాటు చేసింది. హైపవర్ కమిటి ఇప్పటికి రెండు సార్లు భేటి అయ్యింది. ఈ నెల 20వ తేదిలోపు హైపవర్ కమిటి తుది నివేదికను ఇవ్వనుంది.
మూడు రాజధానుల ఏర్పాటు లాంఛనమే అని స్పష్టమవుతోంది. అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా వారిని సంతృప్తి పరిచేలా నిర్ణయం తీసుకొని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సర్కార్ ధృడ నిశ్చయంతో ఉంది. 29 గ్రామాల ప్రజల కోసం రాష్ట్రం మొత్తం అభివృద్దిని ఆపలేం కదా అని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ తన పనిని తాను చేసుకుంటూ ముందుకు పోతుంది.
Latest News