by సూర్య | Sun, Jan 12, 2020, 06:50 PM
సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. పట్టణాలు.. పల్లెబాట పడుతున్నాయి. జంట నగరాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంత ఊళ్లలో పండుగ జరుపుకునేందుకు పయనమై వెళ్తున్నారు. మరికొంత మంది మాత్రం సంక్రాంతి పండుగకు కనీసం ఒకటి రెండు రోజుల ముందు కుటుంబ సభ్యులతో సొంత ఊళ్లలో ఆనందంగా గడపాలని తెగ హడావిడీ చేస్తున్నారు. కానీ ఈ రకంగా కలలు కనే ప్రయాణికులకు నిరాశే మిగిలింది. పండుగ సీజన్ తో ఒక్కసారిగా బస్సు టికెట్ లు కాస్ట్ లీగా మారాయి. దీంతో ప్రయాణికుడు బస్సుల ఛార్జీలను చూసి వామ్మో ఊరికి వెళ్లాల్సిందేనా అనుకుంటున్నాడు.
ఈ సమయంలోనే ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఓ ప్లాన్ వేశారు. ఆ ప్లానే తెలంగాణ బస్సులు వెలవెలబోయేలా చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ బస్సులు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. కానీ తెలంగాణ బస్సులు మాత్రం ఖాళీగా బోసిపోయున్నాయి. ఈ సంక్రాంతి సీజన్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య బస్సులకు మంచి డిమాండ్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల బస్సు టికెట్ల మధ్య భారీ తేడా ఉన్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్న ఏపీ.. విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే బస్సు టికెట్ ధరలను 40 శాతం తగ్గించింది.
హైదరాబాద్ కు వెళ్లి ప్రయాణికులకు తీసుకుని వచ్చే బస్సుల డీజిల్ ఖర్చులైనా వస్తే బాగుంటుందని ఏపీ ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులతో ఈ బస్సులు నిండిపోతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ అధికారులు బస్సుల ఛార్జీలను తగ్గించలేదు. దీంతో హాఫ్ రిటర్న్ ఛార్జీతో విజయవాడ వెళ్లిన బస్సులు, పూర్తి ఖాళీగా వెనక్కు వస్తున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే టీఎస్ ఆర్టీసి బస్సు సూపర్ లగ్జరీ బస్సు ఛార్జీ 372 రూపాయలు కాగా.. ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ఛార్జీ 223 రూపాయలు ఉంది. కాగా మనం కూడా ఏపీ మాదిరిగా ఛార్జీలను తగ్గిద్దామని కొన్ని డిపోల మేనేజర్లు కోరినా ఉన్నతాధికారులు అంగీకరించలేదని తెలుస్తోంది.
Latest News