by సూర్య | Sun, Oct 13, 2019, 08:39 AM
మరిన్ని దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు కృషి చేయనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవం ప్రస్తుతం విశ్వవ్యాప్తమయిందని, చాలా దేశాల్లో భక్తులు స్వామివారి ఆలయాలు ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తున్నారని అన్నారు. సింగపూర్లోని శివన్ ఆలయ ప్రాంగణంలో సింగపూర్ తెలుగు సమాజం, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం 11వ తేదీ నుంచి మూడురోజులపాటు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వదేశాన్ని విడిచినా తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని మరచిపోకుండా ఎక్కడికక్కడ శ్రీనివాసుడి ఆలయాలు నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. సింగపూర్లో నివసించే భక్తులు ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుమలకు వచ్చే ఎన్ఆర్ఐ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తామన్నారు. ఈ కల్యాణోత్సవంలో తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, సింగపూర్ కమ్యూనికేషన్స్, ఐటీశాఖ మంత్రి ఈశ్వరన్ పాల్గొన్నారు.
Latest News