by సూర్య | Sun, Oct 13, 2019, 08:30 AM
దక్షిణాఫ్రికాతో పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఓ అభిమాని మైదానంలోకి దూసుకెళ్ళి భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ పాదాలపై పడ్డాడు. దీంతో.. కంగారుపడిన రోహిత్ శర్మ తన కాళ్లని వెనక్కి తీసుకునే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయి అభిమానిపై పడిపోయాడు. పక్కనే ఉన్న రహానె.. రోహిత్ శర్మ అవస్థలు చూసి ముసిముసిగా నవ్వాడు. అయితే ఈ ఘటనపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. మైదానంలో అభిమాని హంగామాతో తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని పట్టుకుని గ్రౌండ్ వెలుపలికి తీసుకెళ్లారు. ఆ సమయంలో మ్యాచ్ కామెంటేటర్గా ఉన్న సునీల్ గవాస్కర్.. సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఉంది మ్యాచ్ని ఉచితంగా వీక్షించడానికా..? అంటూ సీరియస్ అయ్యాడు. గత ఆదివారం విశాఖపట్నం వేదికగా ముగిసిన తొలి టెస్టులో, అంతకముందు మొహాలిలో జరిగిన రెండో టీ20 మ్యాచ్లోనూ ఇలానే అభిమానులు మైదానంలోకి వచ్చి మ్యాచ్కి అంతరాయం కలిగించారు.‘ఇటీవల భారత్లో తరచూ ఇలా అభిమానులు మైదానంలోకి వచ్చి మ్యాచ్కి అంతరాయం కలిగిస్తున్నారు. ఇది కచ్చితంగా సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యమే. ఆరాధ్య క్రికెటర్ని కలవాలనుకునే అభిమానుల్ని మనం ఇక్కడ నిందలేం. అయితే.. వారిని మైదానంలోకి రానివ్వకుండా అడ్డుకోవాల్సి బాధ్యత భద్రతా సిబ్బందిదే. కానీ.. వారు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు..? ఓ అభిమాని స్టేడియంలోని స్టాండ్స్, గ్యాలరీల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, ఫెన్సింగ్ దాటుకుని మైదానంలోకి రావడం అంత సులువు కాదు. కానీ.. అభిమానులు వస్తున్నారంటే.. సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నట్లు..? సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఉండేది ఉచితంగా మ్యాచ్ చూడటానికి కాదు కదా..?’ అని గవాస్కర్ మండిపడ్డాడు.ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో సెక్యూరిటీ సిబ్బంది.. బౌండరీ లైన్కి వెలుపల స్టేడియంలోని స్టాండ్స్ వైపు కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. కానీ.. భారత్లో సెక్యూరిటీ సిబ్బంది రివర్స్లో మ్యాచ్ని చూస్తూ కూర్చుంటారు. దీంతో.. ఎవరైనా.. మైదానంలోకి వచ్చే వరకూ పసిగట్టలేకపోతున్నారు.
Latest News