by సూర్య | Sat, Oct 12, 2019, 10:02 PM
పౌరహక్కులను, ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ ముఖ్యమంత్రి నిరంకుశ పాలన సాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వం నియంతృత్వంతో వేస్తున్న తప్పటడుగులు ప్రజలను కలవరపెడుతున్నాయి. ప్రజల కనీస అవసరాలైన పారిశుద్ధ్యం, వీధి లైట్లు, తాగునీటి సరఫరా మెరుగుపర్చాలంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మున్సిపల్ కార్యాలయానికి వెళితే.. అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. ఒక ఎమ్మెల్యే అధికారుల స్పందన కోసం రాత్రంతా మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ కానీ, ప్రత్యేక అధికారులు కానీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సమాధానం ఇవ్వలేదు. ఓ వైపు విషజ్వరాల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదేనా ప్రజాపాలనా? సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే రాత్రంతా మున్సిపల్ కార్యాలయంలోనే బసచేసి నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. దున్నపోతు మీద వానపడ్డ చందంలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉంది. ముఖ్యమంత్రి జగన్ అవగాహనారాహిత్యం, అనుభవలేమితో నేడు రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. స్థానిక ప్రజాప్రతినిధి వెళ్లినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేకపోవడం చూస్తే… ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోంది. ఇసుక కొరత, విద్యుత్ కోతలు, పీపీఏలు రద్దు, పోలవరం రివర్స్ టెండరింగ్తో నేడు రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోంది. ఇసుక, మద్యం మాఫియాపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో లేకపోవడం శోచనీయం. వైసీపీ ప్రభుత్వ అరాచకపాలనపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది.
Latest News