by సూర్య | Fri, Oct 11, 2019, 08:19 PM
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్బంగాఅనంతపురంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో వైయస్సార్ కంటివెలుగు పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఎం జగన్ మాట్లాడుతూ మామూలుగా అయితే ఫోన్ కొడితే… కుయ్…కుయ్…కుయ్… అంటూ ఇరవై నిమిషాల్లో అంబులెన్స్ మన వద్దకు వచ్చి… బాగోలేని వారిని ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకుపోయి… ఉచితంగా వైద్యం చేయించి, చిరునవ్వులతో ఇంటికి పంపించాలి. అటువంటి ఈ వ్యవస్థను గత అయిదేళ్లలో పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చబోతున్నాను అని సిఎం జగన్ చెప్పారు. 676 మండలాల్లో 432 అన్ని సదుపాయాలతో కూడిన కొత్త 108 వాహనాలను కొనుగోలు చేస్తున్నామని, 676 మండలాలకు గానూ ప్రతి మండలానికి ఒక కొత్త 104 వాహనాలను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ రెండు పథకాలకు కలిపితే దాదాపుగా పదకొండు వందల పైచిలుకు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చేశామని, ఇవ్వన్నీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు. పలాస, మార్కాపురంలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వున్నారు. ఇప్పటి వరకు వీరి సమస్యలను ఎవ్వరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అటువంటి చోట్ల పరిష్కారం కోసం వెతుకుతున్నాం. ఈ రెండు చోట్ల కిడ్నీ వ్యాధుల పరిశోదన కేంద్రాలు, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాంతంలో సర్ఫేస్ వాటర్ ద్వారానే నీళ్లను పంపిణీ చేస్తాం. మార్కాపురం, పిడుగురాళ్ల, ఏలూరు, పులివెందుల, మచిలీపట్నం, పాడేరు, విజయనగరంలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఏలూరు కాలేజీకి శంకుస్థాపన చేశామన్నారు. డిసెంబర్ 21వ తేదీన రాష్ట్రంలోని అందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని. ఈ కార్డుల్లో వారి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన డేటాను నమోదు చేస్తామనితెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి వివరాలతో కూడిన డేటాను ఈ ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరుస్తామని, ఈ కార్డు పట్టుకుని ఏ ఆసుపత్రికి వెళ్లినా.. వారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి, బ్లడ్ గ్రూప్ తదితర వివరాలు వెంటనే తెలిసిపోతాయన్నారు. వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్యాన్నిఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామని, ఇది జరగాలి అంటే.. మన దగ్గర వున్న ఆసుపత్రుల్లో పనితీరును పూర్తిగా మెరుగుపరచాలన్నారు. మన ఆసుపత్రుల్లోని పరిస్థితులను మార్చాలని, వీటన్నింటికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వాటితో కలిపి మొత్తం 1200 వ్యాదులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తున్నామని తెలిపారు సిఎం.
Latest News