by సూర్య | Wed, Aug 21, 2019, 08:56 PM
శ్రీవారి బ్రహ్మోత్సవాలలోపు తిరుమలలో అవసరమైన ప్రాంతాల్లో మరుగుదొడ్ల మరమ్మతులను పూర్తి చేయాలని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సివిల్, ఎలక్ట్రికల్, వాటర్వర్క్స్ పనులు చేపట్టాలని, అన్ని ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. లడ్డూప్రసాదం తయారీకి సరుకుల కొరత లేకుండా ముందస్తుగా సమకూర్చుకోవాలని ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ జగదీశ్వర్రెడ్డిని ఆదేశించారు. నాణేల పరకామణిలో ఎలాంటి జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రిసెప్షన్ -1, రిసెప్షన్ -2 పరిధిలోని విశ్రాంతి గృహాలు, వసతి గదుల్లో తరచూ తనిఖీలు చేపట్టి ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఎంబిసి-34 తదితర విచారణ కార్యాలయాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు స్వైపింగ్ యంత్రాలను వినియోగించాలని సూచించారు. ప్రాంతాల వారీగా సీనియర్ అధికారులకు వసతి సముదాయాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని, ఈ పనుల ప్రగతిపై వచ్చే వారం నుండి సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
Latest News