by సూర్య | Thu, Mar 21, 2019, 08:15 PM
ఫ్యాక్షన్ సీమలో లా అండ్ ఆర్డర్ సవాలు కాబోతోంది. కడప గడపలో ఎన్నికలు అధికారయంత్రాంగానికి కత్తిమీద సాములా మారాయి. మాట తేడావస్తే అక్కడ బాంబులే సమాధానం చెబుతుంటాయి. పంతాల సీమలో నిండుప్రాణాలు కూడా గడ్డిపోచలే. కడపలో ఫ్యాక్షన్ పగలు చల్లారినట్లే కనిపిస్తున్నా… ఎన్నికలనగానే వేడెక్కుతూనే ఉంది కడప. జిల్లా రాజకీయాల నేపథ్యంతో కడపకో ప్రత్యేకత. జగన్ ఇలాకాలో పట్టుకోసం అధికార టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీడీపీ…అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ కుటుంబ జోరుకు బ్రేక్ వేయాలనుకుంటోంది.
ఫ్యాక్షన్కి కేరాఫ్గా ఉండే జమ్మలమడుగులో గతంలో ఆదినారాయణ రెడ్డి వైసీపీలో ఉంటే…టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ఆయన ప్రత్యర్థిగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆదినారాయణరెడ్డి జగన్తో విభేదించి టీడీపీ గూటికి చేరి మంత్రి అయ్యారు. ఆదినారాయణరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించటంతో పాటు ఆయన కుటుంబానికి ఒక ఎమ్మెల్సీ పదవి హామీఇచ్చారు.
జమ్మలమడుగులో కత్తులు దూసుకున్న ప్రత్యర్థులు ఒక్కటవ్వటంతో …వైసీపీ కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డికి జమ్మలమడుగు టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత. ఈసారి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పాత కేసుల్లో నిందితులపై నిఘా ఉంచి బైండోవర్ కేసులు పెడుతున్నారు. కౌన్సెలింగ్ చేస్తున్నారు.
దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంది పులివెందుల. వైఎస్ కుటుంబ ప్రత్యర్థి సతీష్ రెడ్డి టీడీపీ నుంచి తలపడుతున్నారు. ఈసారి ఎలాగయినా వైఎస్ కంచుకోటలో పాగా వేయాలన్న పట్టుదలతో ఉంది టీడీపీ. జగన్ మెజారిటీని తగ్గించాలన్నది టీడీపీ మెయిన్ టార్గెట్గా చెబుతున్నారు.
వైఎస్ మద్దతుతో మైసూరారెడ్డిని ఓడించారు వీరశివారెడ్డి. నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఎర్రగుంట్ల మండలం జమ్మలమడుగులో కలిసిపోవడంతో కమలాపురంపై దృష్టి పెట్టలేదు మైసూరా. ఆ తరువాత వీరశివాకు ప్రత్యర్థిగా పుత్తా నరసింహారెడ్డి వచ్చారు. 2004లో టీడీపీ నుంచి గెలిచిన వీరశివారెడ్డి తరువాత వైఎస్ పై అభిమానంతో కాంగ్రెస్లో చేరారు. వైఎస్ మరణం, రాష్ట్ర విభజన తర్వాత 2014ఎన్నికల నాటికి టీడీపీ గూటికి చేరిపోయారు వీరశివారెడ్డి. దీంతో సద్దుమణిగిందనుకున్న ఫ్యాక్షన్…ఎన్నికల సమయంలో ప్రభావం చూపుతుందన్న ఆందోళన కొందరిలో ఉంది.