by సూర్య | Wed, Mar 20, 2019, 10:47 PM
కేవలం ‘‘లాలీపాప్’’లు ఇవ్వడం మినహా... దేశ అభివృద్ధి కోసం మోదీ చేస్తున్నది శూన్యమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ కుటుంబంపై ఎన్ని వేధింపులకు పాల్పడినా దేశ రాజకీయాల నుంచి తను వెనక్కి తగ్గే ప్రసక్తి లేనే లేదని స్పష్టం చేశారు. గంగానదీ పరీవాహక ప్రాంత ప్రజలను కలుసుకునేందుకు గత మూడురోజులుగా బోటుయాత్ర చేస్తున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ... దేశ ప్రజలను పిచ్చివాళ్లుగా ప్రధాని మోడీ, అమిత్షాలే కాదు యావత్ బిజేపి భావిస్తోందని, అంతెందుకు గంగా నది ప్రక్షాళన పేరుతో వందల కోట్లు ఖర్చు చేసినా అది ఎంతవరకు సాగిందని నిలదీసారు.
‘‘గత ఐదేళ్లుగా దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలనీ నిర్వీర్యం చేసిన ప్రధానమంత్రి ప్రశ్నించేవారిపై దాడిచేస్తున్నారని ఎద్దేవా చేసారు. ప్రజలను తెలివితక్కువవాళ్లుగా భావించడం ప్రధానిమంత్రికే చెల్లింది. తన కుటుంబాన్నే కాదు ప్రజలను ఎంతగా వేధిస్తే అంత ఉధృతంగా మా పోరాటం ఉంటుందని అన్నారామె. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో పెద్దఎత్తున ప్రజలకు ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు. రానున్న ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన బాధ్యత ప్రజలకు ఉందని పిలుపునిచ్చారు.
Latest News