ఇరవై ఏళ్ల కిందట జరిగిన దానిపై ఇఫుడు రాద్దాంతమా: ఎ.కే.ఆంటోనీ కుమారుడి వ్యాఖ్య

by సూర్య | Wed, Jan 25, 2023, 01:34 PM

భారత్‌లో అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. విదేశీ మీడియా జోక్యం చేసుకుని విభేదాలు సృష్టించే అవకాశం కల్పించరాదని కాంగ్రెస్ పార్టీ కేరళ డిజిటల్ కమ్యూనికేషన్స్ చీఫ్ అనిల్ కె ఆంటొనీ అభిప్రాయపడ్డారు. 20 ఏళ్ల కిందట జరిగినదానిపై ఇప్పుడు రాద్ధాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు. భారత్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందని చెప్పారు. ఇదిలావుంటే ‘‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’’ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీపై తాజాగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి బీజేపీకి అనూహ్య మద్దతు లభించింది. కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు దీనిపై స్పందించారు. 


ప్రధాని మోదీపై బీబీసీ రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌ అల్లర్ల సమయానికి మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని పేర్కొంటూ ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కాగా.. సోషల్ మీడియా వేదికల నుంచి ఇప్పటికే తొలగించారు. భారతీయ మూలాలున్న బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.


ఎన్డీటీవీతో అనిల్ ఆంటోనీ మాట్లాడుతూ.. గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ ఏ సమస్య లేదన్నారు. కానీ, 75 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో విదేశీయులను లేదా వారి సంస్థలను మన సార్వభౌమత్వాన్ని అణగదొక్కడానికి లేదా మన సంస్థలను నాశనం చేయడానికి అనుమతించకూడదని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఈ డాక్యుమెంటరీని నిరోధించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తోందని వ్యాఖ్యానించారు.


‘‘మన గ్రంథాలు, భగవద్గీత, ఉపనిషత్తులు చదివితే.. సత్యం ఎప్పటికీ బయటకు వస్తుందని గమనించవచ్చు.. పత్రికలను నిషేధించవచ్చు.. పత్రికలను అణచివేయవచ్చు.. సంస్థలను నియంత్రించవచ్చు.. సీబీఐని ఉపయోగించవచ్చు. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)... కానీ నిజం నిజమే’’ అని ఆయన అన్నారు. ‘‘సత్యం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. దానికి బయటకు వచ్చే దుష్ట అలవాటు ఉంది. కాబట్టి ఎన్ని నిషేధాలు, అణచివేతలు, ప్రజలను భయపెట్టడం వంటివి నిజం బయటకు రాకుండా ఆపలేవు’’ అన్నారాయన. ఇదిలావుంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ప్రశ్నకు స్పందిస్తూ.. బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని ధ్వజమెత్తారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించారని ఆరోపించారు. తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని దుయ్యబట్టారు. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయని మండిపడ్డారు. ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బీబీసీ వ్యక్తుల ధోరణి కనిపిస్తోందని తెలిపారు. దీనిని ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని ఆయన నిలదీశారు.


Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM