byసూర్య | Wed, Oct 16, 2024, 07:45 PM
తెలంగాణలో అవిభక్త కవలలు వీణ-వాణీ 22వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. బుధవారం (అక్టోబర్ 16న) రోజున 22వ బర్త్ డే జరుపుకోనున్నారు. అవిభక్త కవలలుగా జన్మించిన వీణా-వాణీని విడదీసేందుకు ప్రభుత్వాలు, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. వీరిని విడదీసేందుకు.. ఇక్కడి పెద్ద పెద్ద వైద్యులతో పాటు ఫారిన్ డాక్టర్లు కూడా ప్రయత్నాలు చేశారు. కానీ.. ఫలితం మాత్రం దక్కలేదు. ప్రస్తుతం 22వ జన్మదినం జరుపుకుంటున్న వేళ.. వాళ్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. వారి ఆరోగ్య పరిస్థితి ఏంటీ అని చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళీ, నాగలక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె బింధు కాగా.. రెండో సంతానంగా వీణా-వాణీ అవిభక్త కవలలుగా జన్మించారు. నాలుగో సంతానంగా సింధు జన్మించారు. 2003 అక్టోబర్ 16న సూర్యాపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీణా-వాణీ జన్మించారు. పుట్టుకతోనే వీణా-వాణీ తలలు అతుక్కుని ఉన్నాయి. పుట్టినప్పటి నుంచే.. వాళ్లిద్దరినీ విడదీసేందుకు వైద్యులు ప్రయత్నించారు. రెండేళ్ల పాటు గుంటూరుకు చెందిన వైద్యుడు నాయుడమ్మ దగ్గర చికిత్స అందించారు.
2006లో వీణా-వాణీలను హైదరాబాద్ నీలోఫర్ అసుపత్రికి తరలించారు. ఇద్దరిని వేరు చేసేందుకు ముంబైలోని బ్రీచ్కండీ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అక్కడే 3 నెలల పాటు ఉంచుకుని.. ఆపరేషన్ చేసేందుకు అన్ని రకాల టెస్టులు చేసి వైద్యులు.. తమ వల్ల కాదని చేతులెత్తేశారు. సుమారు 13 ఏళ్ల వరకు.. వీణా-వాణీలకు నీలోఫర్ ఆసుపత్రి అండగా నిలిచింది. కొంత కాలం కిందట ఈ అవిభక్త కవలలను హైదరాబాద్లోని స్టేట్ హోంకు తరలించారు. ప్రస్తుతం వీణవాణీలు శిశువిహార్లోనే ఉంటూ.. డిగ్రీ సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. పదో తరగతి, ఇంటర్ విద్యాలోనూ.. వీణా-వాణీలు మంచి మార్కులే తెచ్చుకోగా.. ఇప్పుడు సీఏలోనూ తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
ఈ అవిభక్త కవలలను నార్మల్గా మార్చేందుకు.. పలు దేశాలకు చెందిన ప్రఖ్యాత వైద్యులు తమ ప్రయత్నాలు చేశారు. ఆపరేషన్ చేస్తామని ముందుకు వచ్చినా.. వారిని పూర్తిగా పరిశీలించాక వెనకడుగు వేశారు. వాళ్లింద్దరిని సాధారణంగా మార్చేందుకు ఆపరేషన్ నిర్వహించాలని.. అందుకు అవసరమైన ఖర్చు మెత్తం ప్రభుత్వమే భరిస్తుందని.. అప్పటి ముఖ్యమంత్రులు ప్రకటించినప్పటికీ.. ఫలితం మాత్రం లేకుండా పోయింది.
పుట్టినప్పటి నుంచి 22 ఏళ్లుగా వీణా-వాణీలు.. ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని వారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిల్లల వయసు పెరుగుతున్నా కొద్ది.. రోజురోజుకు మరింత నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. వారిని తల్లిదండ్రులు వదిలి ఉండలేని పరిస్థితి ఏర్పడింది. తమ పిల్లలకు ఆపరేషన్ చేసి.. ఇద్దరినీ వేరు చేసి.. నరకం నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.