byసూర్య | Tue, Oct 15, 2024, 07:15 PM
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్కు జాతీయ స్థాయిలో కీలక పదవిని అప్పగించింది ఆ పార్టీ అధిష్ఠానం. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్కు కీలక అవకాశం కల్పించిన అధిష్ఠాటం.. ఇప్పుడు బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్ని రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న క్రమంలో.. పార్టీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టింది. అయితే.. ఇందులో తెలంగాణ నుంచి సీనియర్ నేత అయిన ఎంపీ కె. లక్ష్మణ్ను బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఇక.. కో రిటర్నింగ్ అధికారులుగా ఎంపీలు నరేష్ బన్సల్, డా. సంబిత్ పాత్రాతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు రేఖా వర్మను నియమించింది అధిష్ఠానం. వీరి ఆధ్వర్యంలోనే.. బీజేపీ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని ఉత్తర్వుల్లో హైకమాండ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో సీనియర్ నేత అయిన లక్ష్మణ్.. కమలం పార్టీకి వివిధ పదవుల్లో తన సేవలందిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న లక్ష్మణ్ను.. ఉత్తర్ ప్రదేశ్ నుంచి అధిష్ఠానం ఈ అవకాశం కల్పించింది. డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. గతంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా లక్ష్మణ్ సేవలు అందించారు. అంతకుముందు ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొంది అసెంబ్లీలో బీజేపీ తరఫున తన గళాన్ని గట్టిగానే వినిపించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమలం పార్టీ.. రాష్ట్రంలో కీలకంగా ఉన్న నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు ఇస్తూ.. పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకోగా.. అటు కిషన్ రెడ్డికి, ఇటు బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టింది. ఆ తర్వాత.. లక్ష్మణ్కు యూపీ తరపున రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉండగానే.. లక్ష్మణ్కు ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలక పదవి అప్పగించింది. దీంతో.. జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు సముచిత స్థానం ఇస్తున్నట్టుగా పార్టీ కేడర్కు, రాష్ట్ర ప్రజలకు సంకేతాలు ఇస్తోంది బీజేపీ అధిష్ఠానం.