byసూర్య | Mon, Sep 30, 2024, 11:14 AM
చదువుల తల్లి కొలువై ఉన్న బాసర శ్రీ సరస్వతీ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున అక్షర శ్రీకర పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా పలు సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు.
నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజైన అక్టోబర్ 3న శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రగంట, నాలుగో రోజైన అక్టోబర్ 6న కూష్మాండ అవతారం, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని అవతారం, ఏడో రోజు కాళరాత్రి అలంకారం, ఎనిమిదో రోజు మహా గౌరీ, తొమ్మిదో రోజు సిద్ధ ధాత్రి అలంకారం భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ తొమ్మిది రోజులూ ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తారు