'హైడ్రా' భయంతో మహిళ ఆత్మహత్య..? కమిషనర్‌ రంగనాథ్‌ రియాక్షన్

byసూర్య | Sat, Sep 28, 2024, 06:09 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు, కంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు. అక్రమ నిర్మాణదారులకు ముందుగా నోటీసులు ఇచ్చి ఈ కూల్చివేతలు చేపడుతున్నారు. అయితే కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.


హైడ్రా కూల్చివేతల భయంతో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గుర్రంపల్లి శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూమార్తెలు కాగా.. వారందిరికి వివాహాలు జరిపించారు. కట్నకానుక కింద కూకట్ పల్లి శేషాద్రి నగర్‌లో తలా ఓ ఇల్లు రాసిచ్చారు. అయితే శేషాద్రి నగర్ సమీపంలోని చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేతలు చేపట్టగా.. తమ కుమార్తెలకు ఇచ్చిన ఇండ్లు కూడా కూల్చేస్తారనే మనస్థాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.


'ఈ ఘటనతో హైడ్రాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆమె చావుకు హైడ్రా కూల్చివేతలే కారణంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై తాజాగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. బుచ్చమ్మ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదని చెప్పారు. తాము ఎవరికీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని అన్నారు. ' నేను కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడాను. హైడ్రాకు ఆమె చావుకు ఎటువంటి సంబంధం లేదు. బుచ్చమ్మ తమ కూతుర్లుకు రాసిచ్చిన ఇళ్లు కూకట్‌పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నాయి. అయినా అవి ఎఫ్‌టీఎల్‌ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. కూతురి ప్రశ్నలకు ఆవేదన చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది ఈ ఎపిసోడ్‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు.


హైడ్రా గురించి భయాందోళనలు సృష్టించడం మానేయాలని నేను మీడియాను ముఖ్యంగా సోషల్ మీడియాను అభ్యర్థిస్తున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదించటం సరికాదు. కూల్చివేతల కోసం మూసీకి సంబంధించిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. మూసీ నది పరివాహాక ప్రాంతంలో భారీ కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేస్తున్నట్లు అనేక తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఛానెళ్లు తమ స్వార్థ ప్రయోజనాలే ఎజెండాగా హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైడ్రా లేదా దాని కూల్చివేతల గురించి సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడవద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన సూచనలు జారీ చేసింది.' అని రంగనాథ్‌ వెల్లడించారు.


ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇండ్లు కూల్చివేతలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మృతురాలి కుమార్తె కూడా స్పందించారు. తమకు నోటీసులు అందలేదని.. అయితే చుట్టుపక్కల కూల్చివేతలు చేపడుతుండటంతో తమవి కూడా కూల్చేస్తారని భయపడి తన తల్లి ఆత్మహత్య చేసుకుందని అన్నారు.


Latest News
 

వాళ్లందరికీ న్యాయం చేశాకే మూసీ ప్రాజెక్టుపై ముందుకెళ్తాం.. దాన కిషోర్ వివరణ Sat, Sep 28, 2024, 08:51 PM
దామగుండం ఫారెస్ట్‌లో నేవీ రాడార్ స్టేషన్.. 12 లక్షల ఔషధ మొక్కలు నరికేస్తారా..? Sat, Sep 28, 2024, 08:50 PM
హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్.. అదనంగా 5 వేల మందికి ఉద్యోగాలు Sat, Sep 28, 2024, 08:47 PM
ఎదురెదురుగా ఢీకొన్న ఒకే కాలేజీ బస్సులు.. నర్సాపూర్‌లో విషాదం Sat, Sep 28, 2024, 08:46 PM
నేడు భారీ వర్షాలకు ఛాన్స్ లేదు,,,కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు Sat, Sep 28, 2024, 08:44 PM