![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 09:24 PM
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నది ఎప్పటినుంచో వస్తున్న సామెత. నిజానికి.. అర్జెంటుగా వాష్ రూం వచ్చినా ఆపుకోవటం చాలా కష్టం. ముఖ్యమైన పనిలో ఉన్నా.. దాన్ని పక్కనపెట్టేసి మొదట ఆ పని కానిచ్చేస్తాం. అప్పడు కానీ జీవితానికి ప్రశాంతత దొరకదు. ఒకటి (మూత్రవిసర్జన) విషయంలోనే కాదు రెండు (మల విసర్జన) విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇక ప్రయాణాల్లో ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఆ బాధ వర్ణించలేం. అటు ఆపుకోలేం.. ఇటు అందరి ముందు మన పరిస్థితి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతుంటాం. చివరికి సిగ్గు పక్కనపెట్టేసి మన పని జరిగేలా చూసుకుంటాం. ఒకవేళ నాన్స్టాప్ బస్సుల్లో వెళ్తున్నా సరే.. డ్రైవర్ను రిక్వెస్ట్ చేసి మరీ పక్కన ఆపుకుని వాటర్ బాటిల్ పట్టుకుని తుప్పల చాటుకు పరుగులు తీస్తాం. అలాంటిది బండి మీద వెళ్తున్నప్పుడు నెచర్ కాల్ ఇస్తే.. ఊరుకుంటామా.. వెంటనే బండి పక్కన ఆపేసి భారం దించేసుకుంటాం.అచ్చంగా అదే పని చేసిన ఓ వ్యక్తికి మాత్రం వింత అనుభవం ఎదురైంది. మహారాష్ట్రకు చెందిన దినేష్ మంగళ్ అనే వ్యక్తి.. శ్రీశైలం రోడ్డు వెంట ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న క్రమంలో.. అర్జెంటుగా ప్రకృతి పిలిచింది. ఇంటికి వెళ్లే వరకు ఉగ్గబట్టుకోవటం కష్టమని భావించాడో.. లేదా ఇళ్లు చేరేసరి సమయం పడుతుందనుకున్నాడో.. లేదా ఎలాగూ అడవే కదా చెట్టు చాటుకెళ్లి కానిచ్చేస్తే ఓ పని అయిపోతుందనుకున్నాడో.. ఎవరూ లేని ప్రదేశంలో బండి రోడ్డు పక్కన ఆపేసి.. వెంట తెచ్చుకున్న బాటిల్ తీసుకుని తుప్పల చాటుకెళ్లి భారం దించేసుకున్నాడు.
"హమ్మాయ్యా.. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో.." అని ఊపిరి పీల్చుకున్నడో లేదో వెంటనే ఫారెస్ట్ అధికారులు ప్రత్యక్షమైపోయి షాక్ ఇచ్చారు. బండి ఆపి.. అడవిలోకి వాటర్ బాటిల్ తీసుకెళ్లినందుకు తిట్లతో పాటు.. 2000 రూపాయల ఫైన్ కూడా వేశారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన ట్విస్ట్తో.. అవాక్కవటం బాధితుడి వంతైంది.
బయట ఏసీ సులభ్ కాంప్లెక్స్ వెళ్లినా.. 100 రూపాయలు కూడా తీసుకుంటారో లేదో తెలియదు.. కానీ అడవిలో తుప్పల్లోకి వెళ్లినందుకు.. ఏకంగా 2000 రూపాయలు చెల్లించుకోవాల్సి వచ్చిందా అన్న షాక్లో ఉండిపోయాడు. అయితే.. శ్రీశైలం ఫారెస్ట్ (అమ్రాబాద్ ఫారెస్ట్) టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావటంతో.. ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపనివ్వరు. పైగా.. ఈ అడవిలో ప్లాస్టిక్ వాడకాన్ని ఇటీవలే నిషేదిస్తూ ప్రభుత్వం నిర్ణయించగా.. ఆ వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్ను అడవిలోకి తీసుకెళ్లటంతో పోలీసులు ఫైన్ వేసినట్టు తెలుస్తోంది.