byసూర్య | Mon, Jun 24, 2024, 09:58 PM
తెలంగాణ ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే కొత్త రైల్వే స్టేషన్లు, పాత స్టేషన్ల పునరుద్ధరణ జరుగుతుండగా.. తాజాగా రాష్ట్రంలో మరో ట్రైన్ మార్గం అందుబాటులోకి రానుంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం, వస్తు రవాణా కోసం ఈ ట్రైన్ మార్గం నిర్మించనున్నారు. తాండూరు నుంచి జహీరాబాద్ వరకు ఈ కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సర్వే పనులు చేపట్టగా.. ఆ పనులు పూర్తయిన వెంటనే ట్రైన్ మార్గం నిర్మించేందుకు రూ.1,400 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రెడీ చేశారు.
ఈ ట్రైన్ మార్గం అందుబాటులోకి వస్తే గంట వ్యవధిలోనే తాండూరు నుంచి జహీరాబాద్ చేరుకునే వీలుంటుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు, వ్యాపారాలు చేసుకునేవారు ప్రయాణాలు సాగిస్తుండగా.. వారందరికి వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. కాగా, ఈ రూట్లో ట్రైన్ మార్గం నిర్మించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. స్థానికుల డిమాండ్ పరిగణలోకి తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు.. కొత్త ట్రైన్ మార్గం కోసం ఇటీవల సర్వే పనులను ప్రారంభించింది. ఈ సర్వే పనులు ముగిసన తర్వాత 70 కి.మీ. మేర తాండూరు జహీరాబాద్ మధ్య ట్రైన్ మార్గం నిర్మించేందుకు వీలు కలుగుతుంది.
ప్రస్తుతం ఉన్న ట్రైన్ మార్గం వికారాబాద్ మీదుగా నిర్మించారు. దీంతో తాండూరు-జహీరాబాద్ మధ్య 104 కి.మీ. దూరం వస్తోంది. ప్రయాణానికి ఏకంగా మూడు గంటల సమయం పడుతోంది. నూతన రైలు మార్గం 70 కి.మీ ఉండటంతో కేవలం గంటన్నరలోనే చేరుకునే వీలు కలుగుతుంది. దీంతో ప్రయాణ దూరాభారం తప్పనుంది. ఇక తాండూరు కందులకు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. వీటి రవాణాకు కూడా ఈ రైల్వే అనుకూలంగా ఉండనుంది. వీటితో పాటు పలు పరిశ్రమలు తాండూరులో ఉండటంతో గూడ్స్ ట్రైన్ల ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వేకు ఆదాయం సమకూరనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుండగా.. ఒకటి రెండేళ్లలో అందుబాటులోకి రానుంది.