byసూర్య | Sun, Jun 23, 2024, 07:32 PM
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. సంక్షేమంపై దృష్టి సారిందింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే.. మహాలక్ష్మి కింద ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల మేర ఉచిత కరెంట్ ఇస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఆసరా పింఛన్లతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మొన్నే నిర్వహించిన కేబినెట్లో రైతు రుణమాఫీకి ఆమోదం తెలపగా.. మిగతా పథకాలకు విధివిధానాలు సిద్ధం చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే.. ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలు ఆసరా పింఛన్లు, కొత్త రేషన్ కార్డుల గురించి ఎదురుచూస్తుండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఆదివారం రోజు ఖమ్మం జిల్లాలోని పాలేరులో పర్యటించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. అనర్హులను గుర్తించి వాళ్లందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే.. చనిపోయిన వారికి కూడా పింఛన్లు ఇస్తున్నట్టుగా చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం అర్హుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు.. రైతులకు రూ.2 మేరకు పంట రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు.. వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు పొంగులేటి స్పష్టం చేశారు. మరోవైపు.. గత బీఆర్ఎస్ సర్కారు.. పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించిన పొంగులేటి.. తాము మాత్రం అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పాలేరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.