మూడోసారి ప్రధానిగా మోదీ.. తెలంగాణకు గుడ్‌న్యూస్.. మొదటి 100 రోజుల్లోనే

byసూర్య | Wed, Jun 19, 2024, 07:11 PM

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు నుంచే.. మూడోసారి అధికారంలోకి వస్తే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి.. ఏ ఏ పనులు పూర్తి చేయాలి అనేదానిపై సంబంధిత అధికారులతో నరేంద్ర మోదీ సమావేశమై సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో.. వాటిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మొదటి 100 రోజుల్లో చేయాల్సిన పనులపై ఫోకస్ పెట్టారు. ఇందులో తెలంగాణకు శుభవార్తను అందించారు. మోదీ 100 రోజుల ప్రణాళికలో రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి రెండు రోడ్లకు అవకాశం కల్పించారు.


మోదీ 3.0 మొదటి వంద రోజుల ప్రణాళికలో తెలంగాణకు చెందిన రెండు రోడ్లకు చోటు దక్కింది. ఆర్మూరు – జగిత్యాల – మంచిర్యాల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ రోడ్డు.. జగిత్యాల–కరీంనగర్‌ నాలుగు వరుసల రోడ్డుకు ఇందులో అవకాశం కల్పించారు. ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 563 లకు రాజయోగం దక్కనుంది. ఈ వంద రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఉండటంతో ఈ పనుల్లో జాప్యం జరగ్గా.. తాజాగా ఆ ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మూడో టర్మ్ పాలనను వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో ప్రారంభించారు.


 ఈ వంద రోజుల ప్రణాళికలో దేశవ్యాప్తంగా 3 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులను చేర్చారు. వాటిని వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు త్వరగా పనులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. వాటిలో తెలంగాణకు సంబంధించి ఈ రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ఇందులో ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల రోడ్డుకు సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. మరోవైపు.. జగిత్యాల–కరీంనగర్‌ రోడ్డు విస్తరణకు సంబంధించి 6 నెలల క్రితమే టెండర్లు పూర్తి కాగా.. తాజాగా వాటిని రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా - ఎన్‌హెచ్‌ఏఐ వేగంగా చర్యలు చేపడుతోంది.


నిజామాబాద్‌–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్‌పూర్‌ మధ్య ఉన్న ఎన్‌హెచ్‌–63ను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. లారీలు, భారీ ట్రక్కులు ఎక్కువగా తిరిగే ఈ జాతీయ రహదారి రెండు వరుసలతో ఇరుకుగా ఉండి నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో ఆర్మూరు–మంచిర్యాల మధ్య కీలక ప్రాంతాన్ని ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించారు. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరిస్తారు. ఆర్మూరు, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట మీదుగా వెళ్లే ఈ రోడ్డు పొడవు 131.8 కిలోమీటర్లు. ఇక ఈ మార్గంలో 6 నుంచి 12 కిలోమీటర్ల మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవే కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లను నిర్మించనున్నారు. రోడ్ క్రాసింగ్‌ల వద్ద ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మిస్తారు. ఈ మార్గంలో దాదాపు 46 వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.3,850 కోట్లు.


మరోవైపు.. జగిత్యాల నుంచి ఖమ్మం వరకు విస్తరించి ఉన్న ఎన్‌హెచ్‌–563లో కీలక భాగమైన 58.86 కిలోమీటర్ల పొడవు ఉన్న మరో ప్రాజెక్టుకు కూడా ఈ వంద రోజుల ప్రణాళికలో చోటు దక్కింది. రెండు వరుసలు ఉన్న ఈ రహదారిపై ప్రమాదాలు జరుగుతుండటంతో విస్తరించాలని నిర్ణయించారు. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ మధ్య ఎట్టకేలకు పనులు మొదలు పెట్టగా.. జగిత్యాల–కరీంనగర్‌ మధ్య టెండర్ల ప్రక్రియతో ఆగిపోయింది. గత టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా పిలవాలని తాజాగా నిర్ణయించారు. ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి వందరోజుల గడువులో నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. దీనికి రూ.2,151 కోట్లు ఖర్చు అవుతుందని గతంలో అంచనా వేయగా.. అది ఇప్పుడు రూ.2,300 కోట్లకు పెరిగింది.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM