byసూర్య | Sun, Jun 16, 2024, 04:30 PM
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న విద్యుత్ కొనుగోలు అంశం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇవ్వగా.. కమిషన్కు 12 పేజీలతో కూడిన లేఖను కేసీఆర్ పంపించారు. అయితే.. కేసీఆర్ రాసిన లేఖలపై స్పందించిన విద్యుత్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. కేసీఆర్ పంపిన లేఖ అందిందని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. చత్తీస్గడ్ పవర్ పర్చేజ్తో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల గురించిన పలు ప్రశ్నలకు లేఖలో కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన అంశాలను పరిశీలిస్తున్నామని.. లేఖపై నిపుణుల కమిటీతో చర్చిస్తామని నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని.. కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఇచ్చారని వివరించారు.
కేసీఆర్ చెప్పిన వివరాలను వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు నరసింహా రెడ్డి. వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులని కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి (జూన్ 18న) సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయాల్లో జరిగిన పరిణామాలను మాత్రమే మీడియాకు వివరించామని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు.
రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామన్నారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందజేశామని తెలిపారు. ఎంక్వెయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నరసింహారెడ్డికి కేసీఆర్ సూచించటం గమనార్హం. విచారణ నిష్పక్షపాతంగా జరగటం లేదంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.