byసూర్య | Sat, May 25, 2024, 08:31 PM
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోంది. వీకెండ్లో అయితే వేల మంది భక్తులు లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం యాదాద్రి ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక నుంచి భక్తులు తిరుమల తరహాలో స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చునని ఆలయ అధికారులు వెల్లడించారు.
స్వామి వారిని దర్శించుకునేందుకు ఆన్లైన్లో yadadritemple.telangana.gov.in. వెబ్సైట్లోకి వెళ్లి.. టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఈవో భక్తులకు సూచించారు. ఇక ఇదే వెబ్సైట్ నుంచి ఈ-హుండీకి విరాళాలు ఇవ్వవచ్చునని తెలిపారు. ఆన్లైన్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం, పూజ కైంకర్యాలకు బుక్ చేసుకోవచ్చునని యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. వీఐపీ, వీవీఐపీలు, సిఫార్సులపై వచ్చే భక్తులకు రూ.300 టికెట్ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ. 150 చెల్లించి శీఘ్ర దర్శనం ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ అన్ని సేవలను ఇకపై ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు వెల్లడించారు. భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుందని.. అందులో భాగంగానే ఆన్లైన్ సేవలు తీసుకువచ్చామని ఆలయ అధికారులు వివరించారు.