byసూర్య | Sun, May 05, 2024, 07:40 PM
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయి ఎండలకు రోళ్లు పగిలిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి భానుడు భగ భగా మండిపోతున్నాడు. గరిష్ఠస్థాయి ఉష్ణోగ్రతలతో జనాలు బయటికి రావటానికే గజగజా వణికిపోతున్నారు. ధైర్యం చేసి బయటకు వచ్చిన జనాలు మాడు పగలగొడుతున్నాడు సూర్యుడు. భానుడి ప్రతాపానికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 19 మంది ప్రజలు వడదెబ్బలో ప్రాణాలు వదలటం భాధాకరం. కాగా.. ఈ ఎండలకు మనుషులతో పాటు మూగజీవాలు కూడా మృత్యువాతపడుతున్నాయి. ఈ క్రమంలోనే.. మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు మృతి చెందాయి.
ఎండలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో.. చెరువుల్లోని నీరు చూస్తుండగానే ఆవిరైపోతోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతుండటంతో చెరువుల్లో కూడా ఆక్సీజన్ శాతం తగ్గిపోయి చేపలు కూడా మృత్యువాత పడుతున్నాయి. రెండు టన్నుల చేపలు మృతి చెందటంతో.. మత్స్యకారులు బోరుమంటున్నారు. తీవ్రంగా నష్టపోయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చేపలను రక్షిచుకునేందుకు బోరు మోటారు సహాయంతో చెరువులోకి నీటి వదులుతున్నారు. ప్రభుత్వం కూడా తమ ఆదుకోని.. న్యాయం చేయాలని బాధిత మత్స్యకారులు కోరుకుంటున్నారు.
మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. మే నెల మొదటి వారంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలతో పాటు తీవ్రమైన వడగాల్పులు కూడా తోడవటంతో.. జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెరిగిపోతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ నడుస్తున్నట్టు తెలిపింది.