byసూర్య | Sat, Apr 20, 2024, 07:16 PM
చిలుకూరు బాలాజీ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శుక్రవారం నిర్వహించిన గరుడ ప్రసాద వితరణ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట, లక్షల్లో పోటెత్తిన భక్తులను దృష్టిలో పెట్టుకుని.. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఆదివారం జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు రంగరాజన్ ప్రకటించారు. 'వివాహ ప్రాప్తి' కోసం రేపు కల్యాణోత్సవానికి ఎవరూ రావొద్దని రంగరాజన్ విజ్ఞప్తి చేశారు. పెళ్లి కావాల్సిన వాళ్లు తమ ఇళ్లల్లో నుంచే స్వామివారిని ప్రార్థించుకోవాలని సూచించారు. నిన్న గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందుల దృష్ట్యా వివాహ ప్రాప్తిని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
చిలుకూరు బాలాజీ ఆలయంలో రేపు (ఆదివారం) సాయంత్రం కళ్యాణ మహోత్సవం యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసిన అర్చకులు రంగరాజన్.. ఆలయంలోపలికి మాత్రం భక్తులు అనుమతి లేదని పేర్కొన్నారు. నిన్న గరుడ ప్రసాదం వితరణ కార్యక్రమంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శుక్రవారం రోజున.. గరుడ ప్రసాదం కోసం దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు భక్తులు వచ్చినట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రసాదం కేవలం 10 వేల మందికి సరిపోయేంత మాత్రమే ఉండగా.. ఉదయం 10 గంటలకే 70 వేల మందికి పైగా భక్తులు ప్రసాదం కోసం బారులు తీరారు. భక్తుల రద్దీని చూసి.. మళ్లీ చేయించి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారుగా 35 వేల మందికి మాత్రమే ప్రసాదాన్ని పంచారు. ఈ క్రమంలో.. ఆలయంలో భక్తుల తొక్కిసలాట జరగ్గా.. సుమారు 50 మంది వరకు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. భక్తుల రద్దీతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.