యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ

byసూర్య | Thu, Apr 18, 2024, 08:58 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నడుస్తోంది. లోక్‌సభతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, తెలంగాణకు చెందిన మహిళ ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. యూపీలోని జౌన్‌పుర్ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమెకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) లోక్‌సభ టికెట్ ఇచ్చింది.


శ్రీకళారెడ్డి పుట్టిళ్లు తెలంగాణ అయినా.. మెట్టినిల్లు మాత్రం యూపీ. ఆమె భర్త ధనుంజయ్ సింగ్ జౌన్‌పుర్ మాజీ ఎంపీ. స్థానికంగా బాహుబలి నేతగా, బీఎస్పీ అధినేత్రి మాయావతికి సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుకు వెళ్లడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు ధనుంజయ్‌పై నిషేదం విధించింది. దీంతో జౌన్‌పుర్ లోక్‌సభ టికెట్‌ను ధనంజయ్ సింగ్ సతీమణి శ్రీకళారెడ్డికి బీఎస్పీ అధినేత్రి మాయావతి కేటాయించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కృపాశంకర్‌ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబు సింగ్‌ కుష్వాహా బరిలోకి దిగారు. దీంతో పోరు రసవత్తరంగా మారింది.


శ్రీకళా రెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఆమె స్వసస్థలం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం కాగా.. తండ్రి జితేందర్‌రెడ్డి. నల్గొండ జిల్లా కోఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన... 1972లో హుజూర్ నగర్ స్థానం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. నిప్పో బ్యాటరీ గ్రూప్‌ కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే. ఇది చెన్నై కేంద్రంగా పనిచేయడంతో శ్రీకళారెడ్డి బాల్యం మెుత్తం అక్కడే గడిచింది. ఆమె ఇంటర్మీడియట్‌ చెన్నైలో చేయగా.. బీకామ్‌ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు.


2017లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చాలా సింపుల్‌గా యూపీకి చెందిన రాజకీయ నాయకుడు ధనంజయ్ సింగ్‌ను శ్రీకళారెడ్డి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇండియాకు వచ్చి చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో ఎంతోమంది వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులతో పాటు నటుడు అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. ధనుంజయ్‌సింగ్‌ శ్రీకళా రెడ్డి మూడో భార్య. మొదటి భార్య చనిపోవడం, రెండోభార్య విడాకులు తీసుకోవడంతో శ్రీకళారెడ్డిని పెళ్లి చేసుకున్నారు.


రాజకీయాలపై ఆసక్తి ఉన్న శ్రీకళారెడ్డి 2004లో టీడీపీలో చేరారు. అక్కడ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే కావాలనే కోరికతో కోదాడ టీడీపీ టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ టీడీపీలో టిక్కెట్ రాకపోవడంతో ఆ తర్వాత వైసీపీలో చేరారు. తర్వాత రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావుతో కలిసి బీజేపీలో చేరారు. 2019లో హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జడ్పీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.


శ్రీకళారెడ్డి సంపన్నురాలు. ఆమె పేరిట రూ.780 కోట్ల స్థిరాస్తులు, రూ.6.71 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రూ.1.74 కోట్లు విలువైన ఆభరణాలున్నాయి. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్‌లో వివరాలు వెల్లడించారు. ధనుంజయ్‌ సింగ్‌ వద్ద రూ.3.56 కోట్ల చరాస్తులు, రూ.5.31 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM