అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే

byసూర్య | Wed, Apr 17, 2024, 09:03 PM

అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే ఉంటారట.. అది కూడా ఏదో పేరు మోసిన కేఫేలోనో, మిల్క్ షేక్ ఫ్యాక్టరీలోనో దొరుకుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఓ చిన్న కిరాణంలో ఈ మిల్క్ షేక్ దొరుకుతుందటా.. ఇంతకు ఈ మిల్క్ షేక్‌ తాగితే 7 గంటలు మత్తు ఎందుకు ఉంటుందంటే.. అందులో కలిపేది ఏ ఐస్‌క్రీమో కాదండోయ్.. గంజాయి. పాలు, హార్లిక్స్, బూస్ట్‌లో ఈ పౌడర్ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ.. గంజాయిని పొడి చేసి అమ్మేస్తున్నాడు ఓ కిరాణా షాపు యజమాని. ఈ దందా ఎక్కడో కాదు.. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలోని ఓ కిరాణాషాపులో జరుగుతోంది.


గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నా.. పోలీసులకు పట్టుబడిపోతుండడంతో స్మగ్లర్లు ఈసారి రూటుమార్చారు. ఇప్పటివరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్ పౌడర్ రూపంలోకి మార్చారు. పాలు, హార్లిక్స్, బూస్టులో ఈ పొడి కలుపుకొని మిల్క్‌షేక్ రూపంలో తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ యువతను మత్తుకు అలవాటు చేస్తున్నారు. కిరాణాషాపు యజమాని మాటలు విని.. ఈ మిల్క్‌షేక్ తాగినవారు 7 గంటల పాటు మత్తులో జోగుతున్నారు.


జగద్గిరిగుట్ట ప్రాంతంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు దాడులు చేసి కిరాణ దుకాణం యజమాని మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్‌కుమార్ నుంచి 4 కేజీల గంజాయి పౌడర్, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సప్లయ్ చేసిన మోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గంజాయి పొడిని కిలో 2500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.


గంజాయి పొడితో చేసిన చాక్లెట్‌ ఒక్కో దానిని రూ. 40కి విక్రయిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిత్యం గంజాయి పౌడర్, చాక్లెట్లను ఇక్కడి యువతకు సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. గంజాయితో కూడిన మిల్క్‌షేక్ పాలు తాగితే మంచి ఆరోగ్యమని ప్రచారం చేస్తూ.. అమ్ముతున్న మిల్క్ షేక్ పౌడర్‌ని పోలీసులు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM