byసూర్య | Mon, Apr 08, 2024, 06:08 PM
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన పంజాగుట్ట యాక్సిడెంట్ కేసు (ప్రజాభవన్ భారీ కేడ్ల ప్రమాదం)లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రాహిల్ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాహిల్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాక్సిడెంట్ తర్వాత అతడు దుబాయ్ పారిపోయాడు. తన తండ్రితో కలిసి గత నాలుగు నెలలుగా అక్కడే ఉంటున్నాడు. ఇవాళ హైదరాబాద్ వస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. న్యాయమార్తి ఈనెల 22 వరకు రిమాండ్ విధించారు. దీంతో రాహిల్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
అసలు కేసు ఏంటంటే..
గత ఏడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి షకీల్ తనయుడు రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు. ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పీఎస్ పంపి కేసు నమోదు చేయించారు. కేసు విచారించిన పోలీసులు షకీల్ కుమారుడు రాహిల్ అసలు నిందితుడని గుర్తించి అతడపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో లభించిన కాల్డేటా ఆధారంగా షకీల్, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు సీఐలు దుర్గారావు, ప్రేమ్కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయటంతోపాటు అరెస్టు చేసి విచారించారు కూడా. మెుత్తంగా ఈ కేసులో 8 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
కాగా, నాలుగు రోజుల క్రితం రాహిల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై జారీ చేసిన లుక్అవుట్ నోటీసు ఎత్తివేయాలని కోరారు. తాను విచారణకు పూర్తిగా సహరిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అతడు హైదరాబాద్ రాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బంజారాహిల్స్లో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులోనూ రాహిల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ప్రమాదంలో బాలుడు చనిపోగా.. రాహిల్లో కేసు బుక్ చేశారు.