byసూర్య | Fri, Dec 01, 2023, 10:08 PM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పటికే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ప్రధానమైన సర్వేలన్నీ నిన్న సాయంత్రమే (నవంబర్ 30) ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించగా.. తాజాగా ‘ఇండియా టుడే’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించింది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల పోల్స్ ఫలితాలను వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పేర్కొంది.
ఇండియా టుడే - మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు:
బీఆర్ఎస్: 34 - 44
కాంగ్రెస్: 63 - 73
బీజేపీ: 4 - 8
ఇతరులు (ఎంఐంఎం): 5 - 8
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సర్వే సంస్థల్లో మెజార్టీ సంస్థలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి. ఒకట్రెండు సంస్థలు హంగ్ సర్కార్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇండియా టుడే సర్వే సైతం కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపింది. అయితే, మిగిలిన 4 రాష్ట్రాల్లో ఫలితాలను మాత్రం ఇతర సంస్థల కంటే కాస్త భిన్నంగా వెల్లడించింది.
రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 199 స్థానాలకు గాను బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని ఇండియా టుడే - మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 86 -106 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు 9 నుంచి 18 స్థానాల్లో గెలుస్తారని ఈ సర్వే వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో బీజేపీకి 36 - 46 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే పేర్కొంది. కాంగ్రెస్ 40 - 50 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇతరులు 1 నుంచి 5 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది.
మధ్యప్రదేశ్లో గడిచిన 20 ఏళ్లలో 18 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే సర్వే పేర్కొంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 140 - 162 స్థానాల్లో గెలుస్తుందని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 68 - 90 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇతరులు 0 - 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. మిజోరాం రాష్ట్రంలో మిజోరాం నేషనల్ ఫ్రంట్ 3 - 7 సీట్లు, జడ్పీఎం 28 - 35 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 2 - 4 సీట్లు, బీజేపీ 0 - 4 స్థానాల్లో గెలుస్తుందని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. ఆదివారం తెలంగాణ సహా 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మిజోరాంలో మాత్రం కౌంటింగ్ తేదీని డిసెంబర్ 4 (సోమవారం)కు మార్చారు.