byసూర్య | Sun, Sep 24, 2023, 09:21 PM
వైసీపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత , మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అక్రమమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఆయన హైదరాబాద్ లో దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగిస్తానని మోత్కుపల్లి చెబుతుండగా.. ఆయన దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిరసన చేసితీరతానని మోత్కుపల్లి పట్టుబట్టడంతో గంటపాటు దీక్ష చేయడానికి పోలీసులు అనుమతిచ్చినట్లు సమాచారం. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న మోత్కుపల్లి.. ముందుగా ఘాట్ లో అన్నగారికి నివాళులు అర్పించి దీక్ష ప్రారంభించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని, బాబు అరెస్ట్ను మేధావులు ఖండించాలని మోత్కుపల్లి నరసింహులు పిలుపునిచ్చారు. కాగా, అనుమతించిన సమయం పూర్తికాగానే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసే అవకాశం ఉంది.