byసూర్య | Thu, Jan 26, 2023, 09:52 AM
గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందని దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య యోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్య్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింసా, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారత దేశ ప్రధాన లక్షణమని అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యెక్క గొప్పతనమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత పౌరుల విశ్వమానవతత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పథానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. పలు రకాల వేష భాషలు, ప్రాంతాలు, నైసర్గిక స్వరూపాలతో కూడిన భారత దేశం రాష్ట్రాల సమాఖ్యగా ఏకత్వాన్ని ధృఢంగా కొనసాగించడం గర్వకారణమన్నారు. భారత దేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగం అందించిన ఫెడరల్ స్ఫూర్తిని ఆది నుంచి ప్రదర్శిస్తోందని రవీంద్ర కుమార్ తెలిపారు.