![]() |
![]() |
byసూర్య | Mon, Dec 05, 2022, 11:42 PM
పలుమలుపు తిరుగుతూ వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు హైకోర్టులో ఊరట లభించింది. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్ 5కు స్టే విధించిన ధర్మాసనం.. ఈ నెల 13 వరకు స్టేను పొడిగించింది. మరోవైపు జగ్గుస్వామిపై సిట్ అధికారులు జారీ చేసిన లుకౌట్ నోటిసులపై.. ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించగా... వాటిపై కూడా న్యాయస్థానం స్టే విధించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ కేసుతో సంబంధముందని అనుమానిస్తోన్న పలువురిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సిట్ అధికారులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్తో పాటు తుషార్, జగ్గుస్వామికి రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. మొదట సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసిన అధికారులు నవంబర్ 21న ఉదయం పదిన్నరకు కమాండ్ కంట్రోల్లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. అంతేకాదు.. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని కూడా నోటీసులో పేర్కొనగా.. బీఎల్ సంతోష్ మాత్రం విచారణకు హాజరుకాలేదు.
దీంతో.. సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించగా.. తరువాతి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్టు చేయకూడదని ఆదేశించింది. మరోవైపు.. సిట్ అధికారుల విచారణకు సహకరించాలని బీఎల్ సంతోష్కు కూడా ధర్మాసనం సూచించింది. సంతోష్కు మరోసారి నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం సూచించగా.. అధికారులు వాటిని ఈ-మెయిల్ ద్వారా పంపించారు. నవంబర్ 26న లేదా 28న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో.. నోటీసులపై బీఎల్ సంతోష్ క్వాష్ పిటీషన్ వేశారు. ఎఫ్ఐఆర్లో తన పేరు లేనప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని సంతోష్ తరపు లాయర్ వాదించగా.. సంతోష్ను విచారిస్తే కీలక విషయాలు బయటపడతాని సిట్ అధికారులు వాధించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. నోటీసులపై డిసెంబర్ 5 వరకు స్టే ఇచ్చింది. కాగా.. నేడు మళ్లీ విచారణ చేపట్టిన కోర్టు.. డిసెంబర్ 13 వరకు నోటిసులపై స్టే ఇచ్చింది.