byసూర్య | Wed, Mar 31, 2021, 03:30 PM
కరోనా సోకడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. బాలిక కారణంగా ఊరిలో మిగతావారికి కరోనా వ్యాపిస్తుందేమోనన్న భయంతో ఆమెను ఊరిలోకి రానివ్వలేదు. దీంతో ఆమె గ్రామ శివారులో ఏర్పాటు చేసిన గుడిసెకే పరిమితమైంది. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడకు చెందిన మడావి సోన్దేవి నిర్మల్ జిల్లాలోని Tribal Welfare Residential Collegeలో ఇంటర్ చదువుతుంది. అయితే అక్కడ చదువుతున్న పలువురు విద్యార్థులకు కరోనా సోకింది. అందులో సోన్ దేవి కూడా ఉంది. కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో.. ఆమె గ్రామానికి వచ్చింది. అయితే గ్రామస్తులు ఆమెను ఊరిలోకి రానివ్వలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని వారి పొలంలో ప్రత్యేకంగా గుడిసె ఏర్పాటు చేసి.. బాలికను అందులో ఉంచారు. దీంతో బాలిక ఆ గుడిసెలోనే ఐసోలేషన్లో ఉంటుంది. బాలిక ఉంటున్న గుడిసెకు కొద్ది దూరంలో ఆమె తండ్రి నివసిస్తున్నాడు. కూతురిని చూసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఇక, మిగతా కుటుంబ సభ్యులు వారికి ఆహారం అందజేస్తున్నారు. అయితే కరోనా సోకిన బాలికను ఇలా గ్రామ శివార్లలోని గుడిసెలో ఉంచడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కరోనా నెగిటివ్గా నిర్ధారణ అయ్యే వరకు ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్కైనా తరలించాలని వారు అంటున్నారు.