byసూర్య | Thu, Jun 20, 2019, 07:07 PM
మేడిగడ్డ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది అక్కడే. ప్రాజెక్టు మొదలయ్యేది మేడిగడ్డ నుంచే. ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నిర్మించిన ఈ బ్యారేజీ ద్వారా.. నీటిని తిరిగి గోదావరిలోకి ఎత్తిపోస్తారు. 85 గేట్లతో.. నిర్మించిన ఈ బ్యారేజీపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మేడిగడ్డ బ్యారేజీ ఎత్తు - 100 మీటర్ల ఎత్తు ,నిల్వ సామర్థ్యం - 16.17 టీఎంసీలు, గేట్లు - 85. మేడిగడ్డ బ్యారేజీ కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ తగ్గర నిర్మించిన ఈ ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటింది. పునాది పడ్డ మూడేళ్లలోనే ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తైంది. గోదావరిలోకి నీరు ఎక్కువగా లభించే ప్రాణహితను నమ్ముకుని.. ఈ బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. 16.17 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ బ్యారేజీకి 85 గేట్లను అమర్చారు. వంద మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ బ్యారేజీ ద్వారా నీటిని.. అప్రోచ్ ఛానెల్ ద్వారా కన్నేపల్లి పంప్హౌస్కు తరలిస్తారు. కన్నేపల్లి పంప్హౌస్ నుంచి నీటిని అన్నారం బ్యారేజీకి తరలిస్తారు. ఇందుకోసం భారీ కాల్వను నిర్మించారు. సుమారు 14.85 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన నీరు అన్నారం బ్యారేజీ చేరుకుని తిరిగి గోదావరి నదిలో కలుస్తాయి. 2016 మే 2 న భూమిపూజ చేసుకున్న బ్యారేజీ నిర్మాణంలో కాంక్రీట్ పనులు మాత్రం 2018 జనవరిలో మొదలయ్యాయి. అయితే కాంక్రీట్ పనుల్లో రెండు హ్యాట్రిక్ రికార్డులు నెలకొల్పారు. గతేడాది ఏప్రిల్ 15 వ తేదీన ఒకే రోజు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 20 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగ్గా.. అందులో ఒక్క మేడిగడ్డ బ్యారేజీలోనే 7 వేల 212 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులను పూర్తి చేసి హ్యాట్రిక్ సాధించింది. ఇది ఆసియాలోనే మొదటిస్థానంలో నిల్చింది. 2018 డిసెంబర్ 23 న ఒకే రోజున ఏకంగా 16 వేల 722 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులను పూర్తిచేసి మొదటి రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డులతో యావత్ కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేడిగడ్డ బ్యారేజీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. 19 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులను.. ఏడాదిన్న కాలంలోనే పూర్తయ్యాయి. ఇక మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో గేట్ల నిర్మాణంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించారు. ఇందుకోసం జపాన్లోని కోయికై కంపెనీకి చెందిన సిఎన్సి కటింగ్ మిషన్ ను ఉపయోగించారు. దీని సాయంతో ఒక్కో గేటును కేవలం రెండు రోజుల్లోనే తయారుచేశారు. ఇటు 13 వేల లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటు చేశారు. ఇందన సమస్య తల్లెత్తకుండా గేట్ల తయారీ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. 2 వేల 930 కోట్ల వ్యయంతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కోసం వేలాదిగా కూలీలు పనిచేశారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా గత మార్చ్ నెలలో రోజుకు ఐదున్నర వేల మంది కూలీలు బ్యారేజీ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.