by సూర్య | Sun, Aug 25, 2019, 12:44 PM
నటుడు, ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కె.భాగ్యరాజా తానూ ఒకప్పుడు గంజాయికి బానిసగా మారానని సంచలన విషయాన్ని చెప్పారు. ఈ వ్యసనం నుంచి తాను చాలా కష్టంపై బయటపడ్డాననీ, యువత ఇటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. నూతన నటీనటులు విక్కీ ఆదిత్యా, వైశాఖ్, హరిణి నటిస్తున్న ‘కోలా’ చిత్రం ఆడియో రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’నా దగ్గర అసిస్టెంట్ గా ఓ యువకుడు ఉండేవాడు. నేను అప్పట్లో రామనాథపురం నుంచి కోయంబత్తూరుకు రోజూ వచ్చి వెళుతుండేవాడిని. ఓరోజు మేమిద్దరం క్యారమ్స్ ఆడుతున్నాం.
అతను తాగుతున్న సిగరెట్ కొస వింతగా మెరుస్తూ కనిపించింది. దీంతో అదేంటని నేను అడిగా. తాను గంజాయిని సిగరెట్ లో పెట్టి తాగుతున్నాననీ, ఇది తాగితే ధైర్యం వస్తుందని చెప్పాడు. దీంతో ఒక్కసారి తాగి చూద్దామని ఆశతో గంజాయి సిగరెట్ కాల్చా. ఆ తర్వాత దానికి బానిసై పోయా. సినీ దర్శకుడిగా మారేందుకు వచ్చి గంజాయికి బానిస కావడంతో తప్పుదోవలో వెళుతున్నానని అనిపించింది. చివరకు అతికష్టం మీద ఆ దురలవాటును వదిలించుకున్నా. యువత ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి’ అని భాగ్యరాజా అన్నారు.
Latest News