by సూర్య | Fri, Jun 04, 2021, 01:12 PM
కరోనా మహమ్మారి ఎంతోమంది గొప్పగొప్ప వాళ్లను మన నుండి దూరం చేసింది. అలా దూరమైన వాళ్లలో స్వరమాంత్రికుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకరు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు కారణంగా సాధారణ ప్రేక్షకులు సినీప్రముఖులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా తాజాగా బాలును గుర్తు చేసుకుని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎమోషనల్ అయ్యారు. ఈనేపథ్యంలో ఆయన ఓ వీడియోను పోస్ట్ చేసారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ..చాలా రోజులుగా సంగీత ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. దానికి కారణం మన ప్రియతమ బాలు మన మధ్య లేకపోవడమే కారణం. సాధారణంగా పాటకు ప్రాణం పల్లవి అంటారు. కానీ నా దృష్టిలో పాటకు పల్లవికి ప్రాణం బాలూనే. ఎందుకంటే అల్లరిగా ఉండే ఆరేసుకోబోయి పారేసుకున్నా లాంటి పాటలు పాడాలన్నా....భక్తితో అదిగో అల్లదిగో పాట పాడాలన్నా అది బాలూకే సాధ్యం. అలాంటి బాలూ మన మధ్య లేకపోవడం చాలా భాదాకరం. బాలూది నాది యాబై ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవా అని పిలిచేవాడు. ఇప్పటికీ ఆయన మాటలు నా చెవిలో వినిపిస్తునే ఉంటాయి. కొంతమంది చనిపోయిన తరవాత వారి మాటలు వినిపిస్తున్నాయంటారు. కానీ నాకు ఉదయం పాటలు పెట్టినప్పుడల్లా బాలు గొంతు వినిపిస్తూనే ఉంటుంది. బాలూ ఎప్పటికీ మనతోనే ఉంటాడు. అతడి సంగీతం మనం వింటూనే ఉంటాం. అంటూ రాఘవేంద్రరావు బాలూని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
Latest News