by సూర్య | Wed, Jun 22, 2022, 04:54 PM
ట్రస్టు బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తనను తొలగించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోందని టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం దేవస్థానం పాలకమండలి సమావేశంలో పాల్గొన్న అనంతరం అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ.. దేవస్థానానికి, ప్రభుత్వానికి వేర్వేరు అభిప్రాయాలుంటాయని చెప్పారు.
ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను ధర్మకర్తల మండలి తీసుకోలేదని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. గత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తనను ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తానని బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పంచగ్రామాల్లో ఇళ్ల మరమ్మతుల తీర్మానానికి సంబంధించి రిస్క్ తీసుకోలేనని స్పష్టం చేశారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ట్రస్టు బోర్డు ఛైర్మన్ పదవి నుంచి తనను తొలగించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోందని చెప్పారు.
బోర్డు సభ్యుల ప్రతిపాదనను పంపితే న్యాయపరమైన సలహాలు తీసుకుని చట్టబద్ధంగా ఉంటే ఆమోదించడానికి అభ్యంతరం లేదని అశోక్ గజపతి రాజు అన్నారు. ట్రస్టు బోర్డు సభ్యులను పంచ గ్రామాలపై తీర్మానం చేయాలని చెబుతూనే.. మరోవైపు తనను తొలగించాలని మంత్రిపై ఓ రాజ్యసభ సభ్యుడు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. పంచగ్రామాల సమస్య విషయంలో పాలకవర్గం చట్టాన్ని అధిగమించలేదని స్పష్టం చేశారు.
Latest News