by సూర్య | Sat, May 14, 2022, 02:06 AM
అనంతపురంజిల్లాలో టీడీపీలో గ్రూపు రాజకీయాలు ముదిరిపాకనపడుతున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అదే పార్టీకి చెందిన తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిల మధ్య నెలకొన్న వివాదమే ఈ ఉద్రిక్తతకు దారి తీసింది. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు జేసీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గమైన పుట్టపర్తిలోకి తన అనుమతి లేకుండా ఎలా వస్తారంటూ రఘునాథరెడ్డి చాలా కాలం నుంచే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ను కలిసేందుకంటూ జేసీ పుట్టపర్తికి బయలుదేరారు. దీనిపై సమాచారం అందుకున్న పల్లె అనుచరులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధపడ్డారు. వెరసి ఇరు వర్గాల మధ్య గొడవ తప్పదన్న వాదనలు వినిపించాయి. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న పోలీసులు పుట్టపర్తిలో జేసీని అదుపులోకి తీసుకుని పట్టణం నుంచి తరలించారు. దీంతో పరిస్థితి చల్లబడింది.
Latest News