by సూర్య | Mon, Jan 17, 2022, 05:21 PM
పంజాబ్ లో కాంగ్రెస్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అని తేలిపోయింది. దీంతో ఇరు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఓడుతున్నాయి. పంజాబ్ ఓటర్ల నాడి తమకు అనుకులంగా ఉందంటూ వార్తలు, సర్వేలు స్పష్టం చేస్తోన్న నేపథ్యంలో- ఆమ్ ఆద్మీ పార్టీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. పోలింగ్కు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించడానికి సమాయాత్తమౌతోంది. పంజాబ్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును మంగళవారం ప్రకటిస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు మొహాలీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ సభ్యుడు భగవంత్ మాన్.. ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి ఎన్నికల్లో ఆయన లక్ష ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారు. ఈ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు ఘన విజయాన్ని సాధించారు. 2014లోనూ లక్షన్నర ఓట్లకు పైగా తేడాతో శిరోమణి అకాలీదళ్ అభ్యర్థిని మట్టి కరిపించారు. పంజాబ్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన పేరును దాదాపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించవచ్చని తెలుస్తోంది.
Latest News