by సూర్య | Sun, Jan 16, 2022, 08:03 PM
ఎన్నికలకు ముందు ఝలక్ ఇచ్చిన సమాజ్వాది పార్టీ పై తిరిగి ఆపరేషన్ ఆకర్ష్ ప్రవేశపెట్టాలని బీజేపీ భావిస్తోంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోరుకు ముందు బీజేపీ నేతలను ఆకర్షించేందుకు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. ఆయనకు చెక్ పెట్టేందుకు బీజేపీ పోటీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలను అఖిలేశ్ ఎస్పీలో చేర్చుకున్నారు. అటు బీజేపీ కూడా ఎస్పీ నుంచి ఇక ఎమ్మెల్యేకు ఇప్పటికే పార్టీ కండువా కప్పింది. ఇప్పుడు ఏకంగా ములాయం సింగ్ యాదవ్ ఇంటి సభ్యురాలినే తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందన్నది తాజా సమాచారం. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్, బీజేపీకి మధ్య కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్నట్టు పార్టీ వర్గాల కథనం. ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రావాల్సి ఉందంటున్నాయి. అపర్ణా యాదవ్ 2017 ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ సీటు నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి రీతా బహుగుణ చేతిలో 33,976 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో తనకు లక్నో కంటోన్మెట్ టికెట్ ఇచ్చేట్టు అయితే బీజేపీలో చేరి పోటీ చేయాలని అపర్ణా యాదవ్ భావిస్తున్నారు. కాకపోతే ఆమెను గతంలో పోటీ చేసిన చోట కాకుండా, వేరే స్థానం నుంచి రంగంలోకి దింపాలని బీజేపీ అనుకుంటోంది.
Latest News