by సూర్య | Sun, Jan 16, 2022, 07:38 PM
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం పై ఆందోళన వద్దు ఆమె తిరిగి వస్తారని అభిమానులకు సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రముఖ సీనియర్ గాయని లతా మంగేష్కర్ కరోనా బారిన సంగతి తెలిసిందే. 92 ఏళ్ల వయసులో కరోనా సోకడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో జాయిన్ చేసి ICUలో ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే లతను ఆసుపత్రిలో చేర్పించి వారం రోజులవుతున్నా ఇంకా ICU లోనే ఉంచడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ కరోనాతో పోరాడుతున్నారని, ఆసుపత్రిలోనే మరో 10 రోజుల పాటు ఉండాల్సి వస్తుందని డాక్టర్లు అంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని, ప్రస్తుతం ఎవ్వరినీ ఆమె వద్దకు రానీయడం లేదని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్స్ చెబుతున్నారు. దీంతో ఏం జరుగుతుందో అని అభిమానుల్లో కంగారు మొదలైంది. లత మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థిస్తున్నారు. లతా మంగేష్కర్ సోదరి, ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోంస్లే కూడా లత ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. లతను చూడటానికి హాస్పిటల్ వర్గాలు అనుమతించడం లేదని, కరోనా కారణంగా ఎవరిని దగ్గరకు వెళ్ళనివ్వడం లేదని తెలిపారు. ఇప్పటికైతే ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, ఆమె పూర్తిగా కోలుకొని త్వరలోనే మన ముందు వస్తారని అన్నారు.
Latest News