by సూర్య | Fri, Jan 14, 2022, 12:17 PM
ప్రకాశం జిల్లా పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది కరువుకాటకాలే. వర్షంపై ఆధారపడి జీవించే ప్రాంతాలే. ముఖ్యంగా పచ్చిమ ప్రకాశం గురించి చెప్పాలంటే కరువు కాటకాలకు పుట్టినిల్లు అని ప్రతి ఒక్కరు ఒప్పుకోక తప్పదు. అలాంటి ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు ఎప్పుడు లభిస్తాయో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
పచ్చిమ ప్రకాశం ప్రాంతమైన గిద్దలూరు, అర్ధవీడు, బేస్తవారిపేట, కంభం, రాచర్ల, కొమరోలు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం ప్రాంతాలలో మెరుగైన వైద్య సేవల కోసం ప్రజలు కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు.
ఈ ప్రాంతాలలో ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వీరి వైద్యం కోసం సుదూర ప్రాంతాల్లో ప్రయాణించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఏదైనా.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు వీరిని కర్నూలు, గుంటూరు, హైదరాబాద్, నంద్యాల, కడప ప్రాంతాలకు వైద్య సేవలకు తరలించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
సామాన్యుల పరిస్థితి అయితే, ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెట్టుకోవాల్సిన పరిస్థితులు, ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు పైన పేర్కొనబడిన ఊర్ల నుండి ప్రజలు ఒంగోలు వెళ్లేందుకు దాదాపు మూడు నుంచి నాలుగు గంటలకు పైగా ప్రయాణ సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రమాదాలలో గాయపడ్డ వారు కానీ, రోగులు కానీ తమ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల సంఘటనలు అనేకంగా చోటు చేసుకున్నాయి.
మరి ఇలాంటి ప్రాంతానికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం సుదీర్ఘ ప్రయాణం చేయడం తోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితులు తలెత్తుతాయని దీంతో తమ వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అన్ని సదుపాయాలు కలిగిన ఓ ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు అంతంత మాత్రమే ఉన్నాయని అంతేకాకుండా ఆ ఆసుపత్రిలో సంబంధిత కేటగిరి వైద్యులు కూడా చాలా తక్కువగా ఉన్నారని అంటున్నారు.
దీంతో ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు లభించడం లేదని, ఉన్న అరకొర వైద్యులు కూడా పూర్తిగా ఆ ప్రాంతం రోగులకు న్యాయం చేయలేక పోతున్నారని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వాలు ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా అడుగులు వేస్తారో లేదో వేచి చూడాల్సిందే.
Latest News